ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్న టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. వైజాగ్ టెస్ట్లో భారీ విజయం సాధించి హైదరాబాద్ టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్కోట్ టెస్ట్లోనూ అదే జోరు కనబర్చి గెలుపు జెండా ఎగరేయాలనుకుంటోంది.
చివరి మూడు టెస్ట్లకు జట్టులో స్వల్ప మార్పులు చేసిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్, ఆవేశ్ఖాన్లపై వేటు వేసి ఆకాశ్ దీప్కు అవకాశం ఇచ్చింది. గాయాలతో రెండో టెస్ట్కు దూరమైన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో రాగా... వారు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. అందరూ ఊహించనట్లుగానే ఈ సిరీస్ మొత్తానికి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.

వ్యక్తిగత పనులతో కోహ్లీ టీమ్ సెలెక్షన్కు అందుబాటులోకి రాలేదని, అతని ప్రైవసీని గౌరవిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్తోనైనా సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగోడిపై వేటు..:
తొలి రెండు టెస్ట్ల్లో దారుణంగా విఫలమైన తెలుగు తేజం కేఎస్ భరత్పై వేటు పడే అవకాశం ఉంది. నాలుగు ఇన్నింగ్స్ల్లో భరత్.. 41, 28, 17, 6 పరుగులతో విఫలమయ్యాడు. కీపింగ్లోనూ తడబడ్డాడు. సునాయస స్టంపౌట్స్ను చేజార్చాడు. ఈ క్రమంలోనే భరత్పై వేటు వేసి యువ ప్లేయర్ ధృవ్ జురెల్ను ఆడించవచ్చు. అయితే జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ధృవ్ జురెల్కు ప్రతికూలంగా మారింది. ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే భరత్కు చోటు దక్కుతోంది.

సర్ఫరాజ్ ఖాన్ డౌట్..:
డొమెస్టిక్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్.. ఈ మ్యాచ్తోనైనా అరంగేట్రం చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి రెండు టెస్ట్ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్పై వేటు వేయడంతో సర్ఫరాజ్ ఖాన్కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే అతనికి సర్ఫరాజ్ ఖాన్తో పోటీ నెలకొంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయకపోతే.. రజత్ పటీదార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ బరిలోకి దిగుతారు.
సిరాజ్..? ఆకాశ్ దీప్..?:
రెండో పేసర్గా మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి టెస్ట్లో సిరాజ్.. రెండో టెస్ట్లో ముఖేష్ కుమార్ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో.. ఇంగ్లండ్ లయన్స్తో అదరగొట్టిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ను మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న అతనికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం సిరాజ్, ఆకాశ్ దీప్ బెంచ్కు పరిమితమవుతారు. సినియారిటీని పరిగణలోకి తీసుకుంటే సిరాజ్ ఆడుతాడు.
మిగతా లైనప్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. జడేజా ఫిట్నెస్ సాధిస్తే కుల్దీప్ యాదవ్ బెంచ్కు పరిమితమవుతాడు. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ జట్టులో కొనసాగుతారు. బ్యాటింగ్ డెప్త్ నేపథ్యంలో అక్షర్ పటేల్ ప్లేస్కు డోకా లేదు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, యశస్వి ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. గిల్ ఫస్ట్ డౌన్లో ఆడనున్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్
చివరి 3 టెస్ట్లకు భారత జట్టు:
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.