అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్లకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు.

అఫ్గాన్తో టీ20 సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఐ రెండు రోజుల విశ్రాంతి ఇచ్చింది. జనవరి 22(సోమవారం)లోపు భారత ఆటగాళ్లంతా తొలి టెస్ట్ జరగనున్న హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఆ రోజు నుంచే టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు.
సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కావడంతో టీమిండియా గతంలో మాదిరి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుందా? లేక ఇద్దరి స్పిన్నర్లనే ఆడిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జట్టులో అశ్విన్, జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు ఉన్నారు. అయితే తొలి టెస్ట్ జరిగే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా బరిలోకి దిగనుండగా.. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగితే ముఖేష్ కుమార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.
బ్యాటింగ్ యూనిట్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. అయితే కేఎల్ రాహుల్ను కీపర్గా పరిగణించకుంటే అయ్యర్ స్థానంతో అతను మిడిలార్డర్ ఆడుతాడు. అప్పుడు కీపర్గా కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్లో ఒకరు బరిలోకి దిగుతారు.
మూడో స్థానంలో శుభ్మన్ గిల్ వరుసగా విఫలమయ్యాడు. సొంతగడ్డపైనా అయినా అతను సత్తా చాటాల్సి ఉంది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్కు నిరాశే ఎదురవ్వనుంది. గత కొంత కాలంగా టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అతను ఎదురు చూస్తున్నాడు.
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. భారత తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్