ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో పాకిస్థాన్ వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. భారత్ మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. గురువారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీకి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడం టీమిండియాకు సమస్యగా మారింది.
అతని గైర్హాజరీలో టీమిండియా పేస్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు వన్డేల్లో పెద్దగా అనుభవం లేకపోవడం.. మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని ఇటీవలే రీఎంట్రీ ఇవ్వడంతో పేస్ విభాగంపై సందేహాలు నెలకొన్నాయి. క్రికెట్ విశ్లేషకులంతా బుమ్రా లేకపోవడం టీమిండియాకు లోటేనని చెబుతున్నారు. కానీ టీమిండియా స్పిన్ విభాగం బలంగా ఉంది. దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే టీమిండియాకు అడ్వాంటేజ్గా మారనుంది.

డ్యూ కీ రోల్..
టీమిండియా తుది జట్టు ఎంపిక విషయంలో అనేక విషయాలను పరిగణలోకి తీసుకోనున్నారు. డ్యూ కూడా కీలక పాత్ర పోషించనుంది. ముందుగా బౌలింగ్ చేస్తే స్పిన్నర్ల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుంది. అప్పుడు భారత్ ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కానీ కండిషన్స్కు తగ్గట్లు బౌలింగ్ విభాగంలో మార్పులు చేయనున్నారు.
కుల్దీప్ యాదవ్ ఔట్..
మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. అనుభవానికి ప్రాధాన్యం ఇస్తే కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. విభిన్నంగా ప్రయత్నించాలనుకుంటే వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కుతుంది. తొలి వన్డేలో వరుణ్ చక్రవర్తీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. షమీ స్థానంలో హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆ నలుగురికి నిరాశే..
బ్యాటింగ్ విభాగంలో రోహిత్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా పేస్ ఆల్రౌండర్గా ఆడనున్నాడు. ఇంగ్లండ్తో చివరి వన్డే ఆడిన వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్లు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్కు దూరం కానున్నారు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు అవకాశాలు ఇస్తుండటంతో రిషభ్ పంత్కు చోటే లేకుండా పోయింది. అతను కూడా బెంచ్కే పరిమితం కానున్నాడు.
బంగ్లాదేశ్తో భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తీ/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ/హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్