శ్రీలంకతో వన్డే సిరీస్ పరాజయం అనంతరం టీమిండియాకు సుదీర్ఘ విరామం లభించింది. 42 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకం.
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇదే తొలి సిరీస్. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై టెస్ట్ల్లో టీమిండియాకు తిరుగులేదు. 2013 నుంచి ఏ జట్టు కూడా సొంతగడ్డపై భారత్ను ఓడించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను భారత్ 4-1తో గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఓడినా.. చివరి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది.

బంగ్లాదేశ్తో సిరీస్లోనూ టీమిండియాకు తిరుగుండదు. అయితే వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్ట్ల సిరీస్లో పాల్గొననుంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ మ్యాచ్గా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది.
అప్కమింగ్ సిరీస్ల నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో ఆడనుండగా.. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఐదో స్థానంలో కేఎల్ రాహుల్కు చోటు దక్కనుంది. గత టెస్ట్ రికార్డ్స్ నేపథ్యంలో రాహుల్కే అధిక ప్రాధాన్యత దక్కనుంది. రిషభ్ పంత్.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ఆడనున్నాడు. అతను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బరిలోకి దిగనుండగా.. సర్ఫరాజ్ ఖాన్ ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ ఆడనుండగా.. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ షమీ అందుబాటులోకి వస్తే అర్ష్దీప్ సింగ్ బెంచ్కు పరిమితమవుతాడు.
భారత తుది జట్టు(అంచనా) వర్సెస్ బంగ్లాదేశ్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.