హైదరాబాద్: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో శుక్రవారం జరగనున్న మ్యాచ్లో అమీ తుమీ తేల్చుకోనుంది. ఆదివారం జరిగే ఫైనల్కు ముందు రిహార్సల్గా ఈ మ్యాచ్ను ఉపయోగించుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిచినా.. ఓడినా టీమిండియాకు వచ్చే నష్టం ఏం లేదు.
మరోవైపు బంగ్లాదేశ్కు జరిగే నష్టం కూడా ఏం లేదు. ఇప్పటికే ఆ జట్టు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుస విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా అదే జోరులో బంగ్లాదేశ్ను చిత్తు చేసి టైటిల్ బరిలోకి దిగాలని భావిస్తోంది. నామ మాత్రపు మ్యాచ్ కావడంతో తుది జట్టులో మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్దమైంది.

ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో బెంచ్ బలాన్ని పరీక్షించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలను ఆడించనున్నారని క్రిక్బజ్ పేర్కొంది.
బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇవ్వనున్నారని పేర్కొంది. అతని కోసం ఇషాన్ కిషన్ను పక్కనపెట్టే అవకాశం ఉంది. ఆసియాకప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో జోరు మీదుంది. పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్ వర్షంతో రద్దయినా.. నేపాల్పై విజయంతో సూపర్-4 చేరిన భారత్.. పాకిస్థాన్తో పాటు శ్రీలంకను చిత్తు చేసింది.
పాకిస్థాన్తో బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్మురేపిన టీమిండియా.. శ్రీలంకతో మాత్రం కాస్త తడబడింది. శ్రీలంక స్పిన్ ధాటికి బ్యాటింగ్ విభాగం విఫలమైనా.. బౌలర్లు సత్తా చాటి అద్భుత విజయాన్ని అందించారు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా/ శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ/జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ/మహమ్మద్ సిరాజ్.