బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో పర్యాటక బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్లోనూ అదే జోరు కనబర్చాలనుకుంటోంది.
తద్వారా సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది. ఇప్పటికే కాన్పూర్ చేరిన టీమిండియా నెట్స్లో గంటల కొద్దీ శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు బ్లాక్ సాయిల్ పిచ్ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

ముగ్గురు స్పిన్నర్లతో..
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్కు రెడ్ సాయిల్ పిచ్ను సిద్దం చేయగా.. ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు స్పిన్కు సహకరించింది. మధ్యలో బ్యాటింగ్కు కూడా అనుకూలంగా మారింది. కానీ బ్లాక్ సాయిల్ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికెట్పై బౌన్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా కాన్పూర్ వికెట్ స్పిన్నర్లకు సహకరిస్తోంది. చాలా స్లోగా ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్, జడేజా ఆడటం ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ ఎవరా? అనేది ఇప్పుడు సందేహంగా మారింది. స్పెషలిస్ట్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా? లేక బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అక్షర్ పటేల్ను తీసుకుంటారా? అనేది చూడాలి.
కుల్దీప్Xఅక్షర్
2021లో ఇంగ్లండ్తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అతనికే తుది జట్టులో చోటు దక్కుతుంది. మణికట్టు స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ రాకతో ఒక పేసర్ బెంచ్కు పరిమితం కానున్నాడు.
సిరాజ్పై వేటు..
మహమ్మద్ సిరాజ్ లేదా ఆకాశ్ దీప్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో సిరాజ్ కంటే ఆకాశ్ దీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్ట్లో జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.
అతనితో పాటు కోహ్లీ, కేఎల్ రాహుల్లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. గిల్, పంత్ సెంచరీలతో సత్తా చాటగా.. అశ్విన్, జడేజా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశారు.
బంగ్లాతో రెండో టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/ అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్/ మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.