
కేఎల్ రాహుల్ ఔట్..
పేలవ ఫామ్తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ను మూడో టెస్ట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయి. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండదండలున్నా.. అతన్ని రక్షించే వైస్ కెప్టెన్ ట్యాగ్ ఇప్పుడు లేదు. చివరి రెండు టెస్ట్ల కోసం ఆదివారం ప్రకటించిన జట్టులో రాహుల్ పేరు ఉన్నా.. వైస్ కెప్టెన్సీ ట్యాగ్ మాత్రం ఊడింది.
రాహుల్ను తుది జట్టులో నుంచి తప్పించేందుకే సెలెక్టర్లు ఇలా వైస్ కెప్టెన్సీ హోదాను తొలగించారనే ప్రచారం జరుగుతోంది. తదుపరి టెస్టుల్లో రాహుల్కు బదులు శుభ్మన్ గిల్ను ఆడిస్తామని చెప్పేందుకే ఇలా చేశారని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. మూడో టెస్ట్లో శుభ్మన్ ఆడటం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కేఎస్ భరత్పై డౌట్..
రాహుల్ విషయం మినహా తుది జట్టులో టీమిండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వస్తే రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. మిడిలార్డర్లో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆడుతారు. రెండో టెస్ట్లో అయ్యర్ విఫలమైనా అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు.
ఆ తర్వాత జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ ఆడటం ఖాయం. అయితే కేఎల్ రాహుల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటే మాత్రం భరత్పై వేటు పడవచ్చు. వన్డే ఫార్మాట్ తరహాలో రాహుల్ను మిడిలార్డర్లో ఆడించి వికెట్ కీపింగ్ చేయిస్తే భరత్పై వేటు పడనుంది. అయితే ఈ సాహసం టీమ్మేనేజ్మెంట్ చేయకపోవచ్చు.

కుల్దీప్కు మళ్లీ నిరాశే..
బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్తో అదరగొడుతుండగా.. అక్షర్ లోయరార్డర్లో కీలక పరుగులు చేస్తున్నాడు. దాంతో ఈ ముగ్గురిలో ఎవరిని పక్కనపెట్టే అవకాశం లేకపోవడంతో కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు.
పిచ్ కండిషన్స్ను బట్టి బౌలింగ్లో ఏమైనా మార్పులు చేయవచ్చు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. ప్రధాన పేసర్లుగా సిరాజ్, మహమ్మద్ షమీలకు తిరుగు లేదు. మ్యాచ్ టైమ్ వరకు ఎవరైనా గాయపడితే బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్/ కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












