బుమ్రా ఇన్.. ఉమేశ్ ఔట్!
పేలవ బౌలింగ్తో ఓటములు ఎదుర్కొంటున్న టీమిండియా బుమ్రా పునరాగమనం కోసం వేచి చూస్తుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఈ సిరీస్కు ఎంపికైన అతను అనివార్య కారణాలతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రెండో టీ20లో అతను ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉమేశ్ యాదవ్పై వేటు పడనుంది. బుమ్రా కోలుకోని పరిస్థితి ఉంటే దీపక్ చాహర్ ఆడించే ప్రయత్నం చేయవచ్చు. అంచనాలు పెట్టుకున్న భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ విఫలమవుతుండటం టీమిండియాను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా రెండో మ్యాచ్లో బరిలో దిగితే పేస్ దళం కాస్త బలోపేతం కానుంది.
చాహల్ డౌట్..
తొలి టీ20లో దారుణంగా విఫలమైన యుజ్వేంద్ర చాహల్ రెండో మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆసియాకప్ వైఫల్యాన్నే కొనసాగిస్తుండటంతో అతన్ని పక్కనపెట్టి అశ్విన్ తీసుకునే ప్రయత్నం టీమ్మేనేజ్మెంట్ చేయవచ్చు. లేదా మరో అవకాశం ఇవ్వవచ్చు. చాహల్పై వేటు వేస్తే అశ్విన్ బరిలోకి దిగుతాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల స్పిన్నర్లు ఇప్పుడు జట్టుకు అవసరం. అక్షర్ పటేల్ తొలి మ్యాచ్లో అదరగొట్టడంతో అతని చోటుకు డోకాలేదు.
బ్యాటింగ్లో మార్పుల్లేవ్..
తొలి మ్యాచ్లో బ్యాటర్లు అదరగొట్టడంతో మార్పులు ఉండకపోవచ్చు. ఆసీస్తో తొలి టీ20లో భారత్ భారీ స్కోరే సాధించింది. జట్టు పరంగా ప్రదర్శన ఓకే కానీ.. వ్యక్తిగతంగా అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2), దినేశ్ కార్తిక్ (6) అక్షర్ పటేల్ (6) నిరాశపరిచారు. మరీ ముఖ్యంగా దినేశ్ కార్తిక్ హార్డ్హిట్టర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. చివర్లో 16వ ఓవర్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కార్తిక్.. దూకుడుగా ఆడలేకపోయాడు. కేవలం ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో మ్యాచ్లోనైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సంజూ శాంసన్ను తీసుకోకుండా కార్తిక్, పంత్ను తీసుకోవడంపై విమర్శలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. రోహిత్ కూడా కాస్త సంయమనం పాటించి క్రీజ్లో నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయాలని పలువురు మాజీలు సూచించారు. విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాండ్య, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ రాణించడం సానుకూలాంశం.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్/జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్/ రవిచంద్రన్ అశ్విన్