
రోహిత్ శర్మ దూరం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరం అయ్యాడు. బీసీసీఐ అనుమతితో రోహిత్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. వైజాగ్ వేదికగా జరిగే రెండో వన్డేతో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇషాన్ కిషన్తో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో శుభ్మన్ గిల్ వరుస సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ బాదాడు. ఇక బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ సాధించిన తర్వాత అవకాశాలు అందుకోలేకపోయిన ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లురుతున్నాడు.

సూర్యకు లైన్ క్లియర్..
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయంతో జట్టుకు దూరమవడంతో సూర్యకుమార్ యాదవ్కు మార్గం సుగుమం అయ్యింది. టీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్న సూర్య.. వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ సిరీస్లో చెలరేగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరోస్థానంలో బరిలోకి దిగనుండగా.. జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

కుల్దీప్కే చాన్స్..
వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఆడటం ఖాయం. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. న్యూజిలాండ్తో సిరీస్లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. దాంతో యుజ్వేంద్ర చాహల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే సుందర్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ఆడే అవకాశం ఉంది. అయితే ముంబై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్కు అవకాశం దక్కడం కష్టమే.

భారత్ తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్(కీపర్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/ఉమ్రాన్ మాలిక్


Click it and Unblock the Notifications












