ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు ఆఖరి పోరుకు సిద్దమైంది. శనివారం బ్రిస్బేన్ వేదికగా జరిగే మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగో టీ20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు యాషెస్ సిరీస్ నేపథ్యంలో సీనియర్లు దూరమైన వేళ యువ ప్లేయర్లతో ఆడుతున్న ఆసీస్.. సిరీస్ సమం చేయడంపై కన్నేసింది.
టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంలో భాగంగా ఆఖరి మ్యాచ్లోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కోసం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు శివమ్ దూబేకు విశ్రాంతి ఇవ్వవచ్చు.

టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ను టీమిండియా ప్రయోగాలకు ఉపయోగించుకుంది. హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లను తొలి రెండు టీ20ల్లో ఆడించగా.. జట్టు అంచనాలను అందుకోలేకపోయారు. దాంతో మూడో టీ20లో ఈ ముగ్గురిపై వేటు వేసిన గంభీర్.. జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశాలు కల్పించింది. ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. నాలుగో టీ20లో జితేశ్, సుందర్ విఫలమైనా.. ఆఖరి మ్యాచ్లో కొనసాగించనున్నారు.
రెండు మినహా తుది జట్టులో భారీగా మార్పులు జరిగే అవకాశం లేదు. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా సూర్య వైఫల్యం విమర్శలకు దారి తీస్తోంది. బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ,వాషింగ్టన్ సుందర్లు పంచుకోనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అండగా నిలవనున్నాడు.
శుభ్మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(కీపర్), అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.