ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచిన భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగే నాలుగో టీ20లో ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడో టీ20లో అద్వితీయమైన ప్రదర్శనతో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిందిన భారత్.. అదే జోరును నాలుగో టీ20లోనూ కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని ఆసీస్ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మూడో టీ20లో టీమిండియా మూడు మార్పులు చేయడం జట్టుకు కలిసొచ్చింది. కాంబినేషన్ సెట్ అయ్యిందని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. దాంతో నాలుగో టీ20లో ఎలాంటి మార్పులు చేయకుండా భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్కు నిరాశే ఎదురుకానుంది.

టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల్లో భాగంగా టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. హర్షిత్ రాణా, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లను తొలి రెండు టీ20ల్లో ఆడించగా.. జట్టు అంచనాలను అందుకోలేకపోయారు. దాంతో మూడో టీ20లో ఈ ముగ్గురిపై వేటు వేసిన గంభీర్.. జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశాలు కల్పించింది. ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు.
గాయంతో తొలి మూడు టీ20లకు దూరంగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులోకి వస్తే తుది జట్టులో చోటు దక్కనుంది. అతని కోసం శివమ్ దూబేను పక్కన పెట్టవచ్చు. ఈ ఒక్కటి మినహా తుది జట్టులో భారీగా మార్పులు జరిగే అవకాశం లేదు. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా గిల్, సూర్య వైఫల్యం విమర్శలకు దారి తీస్తోంది. గిల్ స్థానంలో సంజూ శాంసన్ను ఓపెనర్గా ఆడించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే అతనికి నాలుగో టీ20 కీలకంగా మారింది.
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(కీపర్), అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా