డబ్లిన్: ఐర్లాండ్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం జరగనున్న ఆఖరి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్పై కన్నేసింది. మరోవైపు ఐర్లాండ్ మాత్రం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది.
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు చేయనుంది. బెంచ్ ఆటగాళ్లందరికి అవకాశం ఇవ్వనుంది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్రసిద్ కృష్ణ, సంజూ శాంసన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండే అవకాశం ఉంది.

బుమ్రా గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనుండగా.. ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి రానున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
ప్రసిధ్ కృష్ణ సైతం తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆసియాకప్కు ఎంపికైన ఈ ఇద్దరికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం ఇద్దరూ కొనసాగుతారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో షెహ్బాజ్ అహ్మద్కు అవకాశం దక్కొచ్చు. రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే కొనసాగనున్నారు.
తిలక్ వర్మ వరుసగా రెండో టీ20ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయినా అతనికి ఆసియాకప్ జట్టులో చోటు దక్కింది. ఇక మూడో టీ20లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. మూడో పేసర్గా అర్ష్దీప్ సింగ్ కొనసాగనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.