హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ మెగా ఫైనల్కు తెరలేవనుంది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఆస్ట్రేలియాకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ ఫైట్కు సిద్దమైంది. ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్ ఫైనల్ జరగ్గా.. న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే గతంలో చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది.

ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను ముగించుకొని అసలు సమరానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ గ్రీన్ వికెట్ సిద్దం చేసింది. పిచ్ పూర్తిగా పచ్చికతో ఉంది. పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఓవల్ పిచ్పై సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లో మ్యాచ్లు జరుగుతాయి. అప్పుడు అక్కడ వాతావరణం పొడిగా ఉండి పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేది.
అయితే జూన్లో ఓవల్ వేదికగా మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. అనూహ్య బౌన్స్తో పాటు స్వింగ్ లభించనుంది. అంతేకాకుండా మ్యాచ్ చివరి రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ కాంబినేషన్లో మార్పులు చేసుకోని బరిలోకి దిగనుంది. ఇద్దరు స్పిన్నర్లకు బదులు ఏకైక స్పిన్నర్తో ఆడనుంది.
రవి చంద్రన్ అశ్విన్కు బదులు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్తో ఆడనుంది. ఎక్స్ట్రా పేసర్గా ఉమేశ్ యాదవ్ ఆడనున్నాడు. వికెట్ కీపింగ్ విషయంలోనూ కేఎస్ భరత్కు బదులు ఇషాన్ కిషన్తో బరిలోకి దిగనుంది. స్వింగ్, బౌన్స్ ఉండనున్న నేపథ్యంలో కీపర్లకు పెద్దగా పని ఉండే అవకాశం లేదు. అంతేకాకుండా ఇషాన్ కిషన్ను తీసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో పాటు ధాటిగా ఆడే బ్యాటర్ జట్టుకు లభిస్తాడు.
ఈ క్రమంలోనే కేఎస్ భరత్ను కాదని ఇషాన్ కిషన్తో రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగనుండగా.. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. జడేజా, శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనుండగా.. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.