హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి కళ్లు అప్కమింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై పడింది. జూన్ 7-11 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకున్నాయి. గత రెండేళ్లుగా సాగిన ఈ బిగ్ టోర్నీలో ఈ రెండు జట్లు టాప్ ప్రదర్శనతో ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్ ఫైట్కు సిద్దమైంది. ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్ ఫైనల్ జరగ్గా.. న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గతేడాది చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది.

ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ఇంగ్లండ్కు చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఐపీఎల్ మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ జరిగే ఒవల్ మైదానం పరిస్థితులు భారత కండిషన్స్కు దగ్గరగా ఉండటం రోహిత్ సేనకు కలిసొచ్చే అంశం. ఒవల్ వికెట్ బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.
ఫస్ట్ ఇన్నింగ్స్లో 350 ప్లస్ పరుగులు చేస్తే ఈ మ్యాచ్పై పట్టు బిగించవచ్చు. ఈ క్రమంలోనే టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ బరిలోకి దిగనుండగా.. ఫస్ట్ డౌన్లో వైస్ కెప్టెన్ చతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నారు.
పుజారా ఇప్పటికే కౌంటీ క్రికెట్ ఆడి మంచి టచ్లో ఉండగా.. ఐపీఎల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లీ భీకర ఫామ్లో ఉన్నారు. టాప్-4 బ్యాటర్లలో రోహిత్ మినహా ముగ్గురు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఐదో స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే బ్యాటింగ్ చేయనుండగా.. ఆరో స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వాస్తవానికి కేఎల్ రాహుల్ అందుబాటులో ఉంటే అతనే వికెట్ కీపర్గా ఆడేవాడు.

తొడ కండరాల గాయంతో అతను దూరమవ్వడంతో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఇషాన్ కిషన్కు పెద్దగా లేకపోయినా.. ధాటిగా ఆడే సామర్థ్యం ఉందనే కారణంతో అతనికి చోటివ్వనున్నారు. అనుభవానికి ఓటేస్తే మాత్రం కేఎస్ భరత్ బరిలోకి దిగుతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ చేయనుండగా.. పేసర్లుగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్/ శార్దూల్ ఠాకూర్లో ఒకరు ఆడనున్నారు.
బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. నలుగు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం అశ్విన్ బెంచ్కు పరిమితం కానున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్/కేఎస్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ఉమేశ్ యాదవ్/జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.