టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో గురువారం జరిగిన సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్ సేన 68 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ అద్భుత విజయంతో శనివారం బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా సైతం ఓటమి ఎరుగని జట్టుగానే టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు చరిత్ర సృష్టించనుంది.

ఓటమెరుగని జట్టుగా ప్రపంచకప్ అందుకున్న టీమ్గా నిలవనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించలేదు.టీ20 ప్రపంచకప్ల్లో భారత్, సౌతాఫ్రికా ముఖా ముఖి పోరు 4-2గా ఉంది. మొత్తం 6 మ్యాచ్ల్లో టీమిండియా 4 సార్లు విజయం సాధించగా.. సౌతాఫ్రికా రెండు సార్లు మాత్రమే గెలుపొందింది.
శివమ్ దూబేపై వేటు..
ఇదే జోరులో ఈ సారి కూడా విజయం సాధించి 11 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్కు టీమిండియా పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది. సూపర్-8 దశ నుంచి ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తున్న రోహిత్ శర్మ.. ఫైనల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన శివమ్ దూబేను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ను ఆడించవచ్చు. ఓపెనర్గా విరాట్ కోహ్లీ తడబడుతున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన సహజ శైలికి భిన్నంగా ఆడబోయి విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు.
ఫస్ట్ డౌన్లో కోహ్లీ..
ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే కోహ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. జడేజా ఫామ్లో లేకపోయినా.. బిగ్ మ్యాచ్ విన్నర్గా గుర్తింపు ఉన్న అతను జట్టులో కొనసాగనున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లు కూడా తుది జట్టులో కొనసాగనున్నారు. దాంతో యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్లకు నిరాశే ఎదురవ్వనుంది.
పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఆడనుండగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. విన్నింగ్ కాంబినేషన్ను మార్చే ఉద్దేశం రోహిత్ శర్మ లేకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
సౌతాఫ్రికాతో ఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా