ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో బోణి కొట్టిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం (జూన్ 10) నుంచి లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్తో మూడో టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఓటమి పాలైన భారత్.. ఎడ్జ్బాస్టన్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఎడ్జ్బాస్టన్లో సమష్టి ప్రదర్శనతో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఇదే జోరును లార్డ్స్ టెస్ట్లో కొనసాగించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోని సిరీస్పై పట్టు సాధించాలనే వ్యూహంతో గిల్ సేన ఉంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే విజయం సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెండో టెస్ట్కు దూరమైన బుమ్రా.. లార్డ్స్ టెస్ట్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో టెస్ట్ విజయానంతరం శుభ్మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇస్తే..తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా స్థానంలో రెండో టెస్ట్ ఆడిన ఆకాశ్ దీప్(4/88, 6/99) 10 వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చాడు. తొలి టెస్ట్లో విఫలమైన మహమ్మద్ సిరాజ్(6/70, 1/57) మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో రెండు టెస్ట్ల్లో విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ల్లో అతను ధారళంగా పరుగులిచ్చాడు.
తెలుగు తేజం, పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో బరిలోకి దిగిన నితీష్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో(1, 1) రెండు పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో అతన్ని తప్పించి స్పెషలిస్ట్ పేసర్ అయిన అర్ష్దీప్ సింగ్ను ఆడించే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్ట్ పేస్కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ నితీష్ను కొనసాగిస్తే మాత్రం సుందర్పై వేటు పడుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను ఆడించాలనుకుంటే అర్ష్దీప్ సింగ్ బెంచ్కే పరిమితమవుతాడు. సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు.
వరుసగా రెండు టెస్ట్ల్లో విఫలమైన కరుణ్ నాయర్ను కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయి. నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను 0, 20, 31, 26 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్ట్లో ఫస్ట్ డౌన్కు ప్రమోట్ చేసినా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కరుణ్ నాయర్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అతను లార్డ్స్ టెస్ట్ ఆడుతాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా మారితే భారత్కు తిరుగుండదు.
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/అర్ష్దీప్ సింగ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్.