చెన్నై: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ప్రపంచకప్ షూరూ కానుంది. ఆతిథ్య భారత్ ఆదివారం ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకోగా.. అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్కు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా.. అక్కడి ఉక్కపోత పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇక టీమిండియా ఎలాంటి సన్నాహక మ్యాచ్ ఆడకుండానే మెగా టోర్నీ ఆడేందుకు సిద్దమైంది.

భారత్ ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో టీమ్ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. పైగా చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ఎలాంటి బౌలింగ్ కాంబినేషన్ ఎంచుకుంటదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ముగ్గురు స్పిన్నర్ల లేక ఇద్దరు స్పిన్నర్లా? అనేది తేలాల్సి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. అయ్యర్ ఫిట్గా ఉంటే అతనికే అవకాశం దక్కుతుంది.
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. అతనికి ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే బ్యాకప్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడుతాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఆడనుండగా.. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్కు అవకాశం దక్కనుంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లపై అశ్విన్కు మెరుగైన రికార్డు ఉండటంతో పాటు ఆ జట్టులో లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అశ్విన్కు తొలి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. పైగా చెన్నై అతనికి లోకల్ గ్రౌండ్. అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్ ఆడుతాడు. లేదంటే మాత్రం బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. మూడో పేసర్గా శార్దూల్ ఠాకూర్ ఆడనున్నాడు. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్