ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలను యువ బ్యాటర్ శుభ్మన్గిల్కు అప్పగించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం దక్కింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీపై వేటు పడగా.. స్వింగ్ కింగ్ అర్ష్దీప్ సింగ్కు తొలిసారి టెస్ట్ టీమ్ నుంచి పిలుపు అందింది. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఎంపికవ్వగా.. శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తిరిగి వచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి 24 మధ్య లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ మొదలవ్వనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా ఎలా ఆడబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఓపెనర్లుగా యశస్వి, గిల్..?
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆడే అవకాశం ఉంది. గతంలో రోహిత్ శర్మ లేని మ్యాచ్ల్లో ఈ ఇద్దరూ టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించారు. రోహిత్కు జైస్వాల్ జత కలిసిన తర్వాత శుభ్మన్ గిల్ మూడో స్థానంలో ఆడాడు. తాజా సిరీస్లో కూడా బుమ్రా మూడో స్థానంలో కొనసాగితే సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయవచ్చు. లేదంటే అతను ఫస్ట్ డౌన్లో ఆడుతాడు. కరుణ్ నాయర్ నాలుగో స్థానంలో ఆడొచ్చు. కోహ్లీ స్థానాన్ని కరుణ్ నాయర్తో భర్తీ చేసే అవకాశం ఉంది.
నితీష్ డౌట్..
మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఆడనున్నారు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డికి శార్దూల్ ఠాకూర్తో పోటీ నెలకొంది. నితీష్కే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఆడనున్నాడు. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ పంచుకోనున్నారు. బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. అతని స్థానంలో ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణల్లో ఒకరు బరిలోకి దిగవచ్చు. అభిన్యు ఈశ్వర్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు.
భారత తుది జట్టు
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్.