ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏలో టాపర్గా నిలిచిన టీమిండియా.. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి తలపడుతున్నాయి. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచ్లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్ 2023 ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు గ్రూప్-బీలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఆసీస్.. వర్షం సాయంతో సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇంగ్లండ్పై సంచలన విజయాన్నందుకున్న ఆసీస్ అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. దాంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆసీస్.. సెమీఫైనల్లో టీమిండియాను ఢీకొంటుంది. మరోవైపు ఆ జట్టుకు సీనియర్ ఆటగాళ్లు అయిన ప్యాట్ కమిన్స్, హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ అందుబాటులో లేరు. కానీ కుర్రాళ్లతో ఆ టీమ్ పటిష్టంగానే ఉంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగి టీమిండియాకు షాకివ్వాలనే పట్టుదలతో ఉంది.

మహమ్మద్ షమీ దూరం..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో టీమిండియా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్పిన్కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్పై నలుగురు స్పిన్నర్లతో ప్రత్యర్థుల పతనాన్ని శాసిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. టీమిండియా టాప్-4 బ్యాటర్లలో ఇద్దరు రాణించినా.. ఆసీస్ను భారత్ మట్టికరిపిస్తోంది. సెమీస్ పోరుకు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే ఆడనుంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీకి గాయమైంది. బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా.. మిచెల్ సాంట్నర్ వేసిన త్రో అతని భుజానికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన షమీ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఫిట్గా లేకుంటే అతని స్థానంలో హర్షిత్ రానా లేదా అర్ష్దీప్ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది.
కుల్దీప్ డౌట్..
బ్యాటింగ్, స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. న్యూజిలాండ్తో మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని కొనసాగించనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్పై వేటు పడనుంది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లీ, అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్ మిడిలార్డర్లో ఆడనున్నారు. జడేజా, హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషించనున్నారు.
ఆస్ట్రేలియాతో సెమీఫైనల్.. భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ/ హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ.