ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా శుభారంభం చేసింది. బంతితో మహమ్మద్ షమీ(5/53), బ్యాట్తో శుభ్మన్ గిల్(129 నాటౌట్) చెలరేగడంతో బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో టాప్లో కొనసాగుతోంది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కనుంది. ఈ క్రమంలోనే తమ అత్యుత్తమ జట్టుతో టీమిండియా బరిలోకి దిగనుంది.
కుల్దీప్పై వేటు..
దాదాపు విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించనున్న టీమిండియా.. బౌలింగ్ విభాగంలో మాత్రం స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో తేలిపోయిన కుల్దీప్ యాదవ్పై వేటు వేయనుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అతను పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి అవకాశం ఇవ్వవచ్చు. అయితే పాకిస్థాన్తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ లెక్కన అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతాడు.

అర్ష్దీప్ సింగ్ డౌట్..
ఇక తొలి మ్యాచ్లో పేసర్లే ప్రభావం చూపారు. 8 వికెట్లు స్పెషలిస్ట్ పేసర్లే దక్కించుకున్నారు. ఈ విధంగా ఆలోచిస్తే టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగవచ్చు. అప్పుడు అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వస్తాడు. జట్టులో లెఫ్టార్మ్ పేసర్ ఉండాలని భాంచినా అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కుతుంది. అప్పుడు హర్షిత్ రాణా ఉద్వాసనకు గురవుతాడు. మహమ్మద్ షమీ ఐదు వికెట్ల ప్రదర్శన బుమ్రా లేని లోటును తీర్చింది. మెగా టోర్నీల్లో మరోసారి షమీ తన సత్తా ఏంటో చాటాడు.
టాప్-3 బ్యాటర్లు చెలరేగితే..
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కొనసాగనున్నారు. ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ధాటిగా ఆడుతూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తున్నారు. శుభ్మన్ గిల్ వరుసగా రెండు శతకాలు నమోదు చేశాడు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. 14 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 15 పరుగుల దూరంలో ఉన్నాడు.

నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్లుగా ఆడనున్నారు. టాప్-5 బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాకు తిరుగుండదు. సాధారణంగా విన్నింగ్ కాంబినేషన్ను మార్చడానికి రోహిత్ పెద్దగా ఇష్టపడడు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో చూడాలి.
పాకిస్థాన్తో తలపడే భారత తుది జట్టు(అంచనా): శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.