ఆసియా కప్ 2025 తొలి సమరానికి టీమిండియా సిద్దమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో యూఏఈతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీ కోసం అన్ని విధాల సిద్దమైన టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. యూఏఈ పసికూన జట్టే అయినా.. టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
శుభ్మన్ గిల్ రీఎంట్రీతో ఓపెనర్గా ఎవరు ఆడుతారు..? ఇన్నాళ్లు ఓపెనర్గా ఆడిన సంజూ శాంసన్ను జట్టులో కొనసాగిస్తారా? గతంలో మాదిరి మిడిలార్డర్ ఆడిస్తారా? లేక బెంచ్కే పరిమితం చేస్తారా? ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకుంటారా? బౌలర్తో ఆడుతారా? అనేవి మిలియన్ డార్ల ప్రశ్నలుగా మారాయి. ఈ క్రమంలోనే యూఏఈతో మ్యాచ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శుభ్మన్ గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్.. 10 ఇన్నింగ్స్ల్లో 3 శతకాలతో సత్తా చాటాడు. కానీ గిల్ రాకతో అతనికి ఓపెనర్గా ఆడే అవకాశం లేదు. ఈ క్రమంలోనే అతను బెంచ్కు పరిమితమవుతాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ కేరళ టీ20 లీగ్లో అతను సిక్సర్ల మోత మోగించాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు. కాబట్టి అతని ఫస్ట్ డౌన్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలోనూ సూర్యకుమార్ యాదవ్.. సంజూ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతన్ని బాగానే చూసుకుంటున్నామని, తుది జట్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. సంజూ గురించి చింతించాల్సిన పనిలేదన్నాడు. ఈ వ్యాఖ్యలు సంజూను తుది జట్టులో ఆడిస్తారనే సంకేతాన్ని ఇస్తున్నారు. ఒకవేళ సంజూ ఫస్ట్ డౌన్లో ఆడితే తిలక్ వర్మపై వేటు పడుతుంది.

రింకూ సింగ్కు బదులు శివమ్ దూబేను ఆడించే అవకాశాలున్నాయి. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడటంతో పాటు శివమ్ దూబే కారణంగా టీమిండియా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభించనుంది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఈ లెక్కన శివమ్ దూబే ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రింకూ సింగ్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది.
దుబాయ్ పిచ్ సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీతో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఆడనున్నారు. అర్ష్దీప్ సింగ్కు హర్షితా రాణా నుంచి పోటీ నెలకొంది. లోయరార్డర్ బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తుది జట్టులో ఉంటాడు. ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే కుల్దీప్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. అప్పుడు రింకూ సింగ్, తిలక్ వర్మలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
అభిషేక్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అభిషేక్ శర్మ రూపంలో టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభించనుంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే మిడిలార్డర్లో ఆడనున్నారు.
యూఏఈతో తలపడే భారత తుది జట్టు(అంచనా):
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.