ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. ముంబై వేదికగా ఆదివారం జరిగే చివరి మ్యాచ్లో ఇంగ్లండ్తో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. పుణె వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టి ప్రదర్శనతో 15 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో ఆఖరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.
సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో 3 వన్డేల సిరీస్లో బరిలోకి దిగాలనుకుంటోంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో టీమిండియా కాంబినేషన్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వనున్నారు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకున్నా.. బౌలింగ్ కాంబినేషన్ను మార్చనున్నారు.

అర్ష్దీప్, బిష్ణోయ్ ఔట్..
అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్లను తుది జట్టు నుంచి తప్పించనున్నారు. శివమ్ దూబే ఫిట్గా ఉంటే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వనున్నారు. అతని స్థానంలో రమణ్దీప్ సింగ్ ఆడనున్నాడు. ఒకవేళ శివమ్ దూబే అందుబాటులో లేకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగుతాడు. ప్రధాన పేసర్లుగా మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా బరిలోకి దిగనున్నారు. కంకషన్ సబ్స్టిట్యూట్ బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చిన హర్షిత్ రాణా.. తనని తప్పించలేని పరిస్థితిని కల్పించాడు.
మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చి ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన షమీకి ఈ ఆఖరి టీ20లో చోటు దక్కనుంది. వన్డే సిరీస్కు ముందు అతను లయను అందుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ చివరి మ్యాచ్లోనైనా రాణించాల్సి ఉంది. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీతో పాటు అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. రమణ్దీప్ సింగ్ జట్టులోకి వస్తే వారికి అండగా బౌలింగ్ చేయనున్నాడు.
ఇంగ్లండ్తో చివరి టీ20.. భారత తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రమణ్దీప్ సింగ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, మహహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ.