ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో ఆధిక్యంలో వెళ్లేందుకు వచ్చిన సువర్ణవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. లార్డ్స్ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్ట్లో 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. తొలి రెండు టెస్ట్ల్లో దుమ్మురేపిన భారత బ్యాటింగ్ దళం.. ఈ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. దాంతో ఈ ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.
లార్డ్స్ టెస్ట్ ఓటమి నేపథ్యంలో నాలుగో టెస్ట్లో టీమిండియా మార్పులు చేయనుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు పడనుంది. 'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్'అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్న కరుణ్ నాయర్.. 6 అవకాశాలను వృథా చేసుకున్నాడు. 0, 20, 31, 26, 40, 14 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. అద్భుతమైన ఆరంభాలను అందుకున్న వాటిని భారీ స్కోర్లుగా మల్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే మాంచెస్టర్ టెస్ట్ నుంచి కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్లో ఒకర్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి.

లార్డ్స్ టెస్ట్లో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన రిషభ్ పంత్.. నాలుగో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం కారణంగా కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమైన రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలకపోయాడు. చేతి నొప్పితో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఒక్క చేతితో ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. రిషభ్ పంత్ గాయం తీవ్రతపై ఎలాంటి అప్డేట్ లేదు. నాలుగో టెస్ట్కు ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఆలోపు కోలుకుంటే పంత్ ఆడుతాడు. లేదంటే అతని స్థానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి వస్తాడు. మిగతా బ్యాటింగ్ లైనప్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఫ్లాట్ వికెట్స్పై చెలరేగిన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్.. కాస్త స్వింగ్కు అనుకూలించిన వికెట్పై తేలిపోయారు. ఈ ఇద్దరూ బాధ్యతాయుతంగా రాణించాల్సిన అవసరం ఉంది.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ అనంతరం బుమ్రా రెస్ట్ గురించి ప్రశ్నించగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఈ సిరీస్కు ముందే బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడుతానని చెప్పాడు. ఇప్పటికే అతను రెండు మ్యాచ్లు ఆడాడు. అతని గైర్హాజరీలనూ టీమిండియా విజయం సాధించింది. నాలుగో రోజు ఆటలో బుమ్రాకు స్వల్ప గాయం కూడా అయ్యింది. ఈ క్రమంలోనే మాంచెస్టర్ టెస్ట్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. ఆఖరి మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. బుమ్రా దూరమైతే అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. సిరాజ్, ఆకాశ్ దీప్ కొనసాగుతారు. స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో వారు కూడా కొనసాగనున్నారు. దాంతో కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.