ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే మూడో వన్డేలో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా.. ఆఖరి పోరులోను అదే జోరు కనబర్చాలనుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు టీమిండియా ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావడంతో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది.
నాలుగు మార్పులతో..
ఈ క్రమంలోనే టీమిండియా తుది జట్టులో నాలుగు మార్పులు చేసే అవకాశం ఉంది. స్టార్ పేస్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో ఆఖరి వన్డేకు అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్రకటించినా.. అతని ఫిట్నెస్పై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం బుమ్రా ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడనేదానిపై క్లారిటీ లేదు. తొలి రెండు మ్యాచ్ల్లో బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

శుభ్మన్ గిల్ ఔట్..
మోకాలి వాపుతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్తో జట్టులోకి వచ్చాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం విధ్వంసకర శతకంతో ఫామ్ అందుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్కు మూడో వన్డే నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో యశస్వి జైస్వాల్ను ఆడించవచ్చు. హర్షిత్ రాణా కూడా బెంచ్కే పరిమితమవ్వనున్నాడు. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగవచ్చు.

రిషభ్ పంత్ రీఎంట్రీ..
తొలి రెండు మ్యాచ్ల్లో రిషభ్ పంత్కు కూడా చోటు దక్కలేదు. అతని స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయలేదు. కాబట్టి తొలి రెండు మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్(59, 44)కు ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చి పంత్కు అవకాశం ఇవ్వనున్నారు. కేఎల్ రాహుల్కు కూడా మరో అవకాశం ఇవ్వనున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా.. బ్యాటింగ్ అవకాశం రాని జడేజా జట్టులో కొనసాగనున్నాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు లేవు.
ఇంగ్లండ్తో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ.