ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమవుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సునాయసంగా గెలిచేలా కనిపించిన భారత్.. చివరకు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ప్రత్యర్థి విధించిన లక్ష్యాన్ని తక్కువ అంచనా వేయడం టీమిండియా కొంపముంచింది. తొలి టెస్ట్ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న టీమిండియా.. రెండో టెస్ట్లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టింది. అయితే ఓటమి బాధలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్ట్లకు అందుబాటులో లేకపోగా.. తాజాగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు.

వారి స్థానంలో బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే భారత తుది జట్టు ఎంపిక కీలకంగా మారింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో రజత్ పటీదార్ అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఇక తొలి టెస్ట్లో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్పై వేటు వేస్తే.. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయనున్నాడు.
కానీ రాహుల్, జడేజా దూరమైన నేపథ్యంలో శుభ్మన్ గిల్కే మరో అవకాశం ఇవ్వచ్చు. రజత్ పటీదార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ల్లో ఈ ఇద్దరూ శతకాలతో సత్తా చాటారు. శ్రేయస్ అయ్యర్ సైతం తొలి టెస్ట్లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే సత్తా అతనికి ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
రాహుల్ దూరమైన నేపథ్యంలో కేఎస్ భరత్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. పైగా వైజాగ్ అతనికి హోమ్ గ్రౌండ్. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో మరోసారి కుల్దీప్ యాదవ్కు నిరాశే ఎదురవ్వనుంది. పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు కొనసాగనున్నారు. అయితే సిరాజ్ తొలి టెస్ట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి బదులు ముఖేష్ కుమార్ను ఆడించే అవకాశాలను టీమిండియా మేనేజ్మెంట్ పరిశీలించవచ్చు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్/సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్, కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్.