ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. బుధవారం బర్మింగ్హామ్ మైదానం వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఐదుగురు బ్యాటర్లు శతకాలు నమోదు చేసినా.. భారత్ గెలవలేకపోయింది. చెత్త ఫీల్డింగ్, లోయరార్డర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్లు వదిలేసారు. బ్యాటింగ్లో టాపార్డర్ చెలరేగినా.. లోయారర్డర్ విఫలమైంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రెండో టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా మూడు టెస్ట్లు మాత్రమే ఆడుతాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. బుమ్రా సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టెస్ట్ ఆడిన బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రెండో టెస్ట్ నుంచి బుమ్రా విశ్రాంతి కల్పించి మూడో టెస్ట్ ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుమ్రా దూరమైతే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. అయితే అర్ష్దీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్ నాయర్ (0, 20) తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కరుణ్ నాయర్.. రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఒక్క ఛాన్స్ కావాలిన కోరిన కరుణ్ నాయర్కు రెండు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ను తప్పించి ధ్రువ్ జురెల్ను ఆడించే అవకాశాలు ఉన్నాయి.
తొలి టెస్ట్లో తీవ్రంగా నిరాశపర్చిన శార్దూల్ ఠాకూర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. బ్యాటింగ్(1, 2), బౌలింగ్లో(0/38, 2/51) దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయవకాశాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ను తప్పించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే ఛాన్స్ ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్.. బ్యాట్తో సత్తా చాటాడు. లోయరార్డర్లో విలువైన పరుగులు జోడించాడు. మెల్బోర్న్ టెస్ట్లో ఓ సెంచరీ కూడా సాధించాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాలనుకుంటే ప్రసిధ్ కృష్ణ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు(అంచనా): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.