హైదరాబాద్: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శనివారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో స్పిన్తో ప్రత్యర్థి పతనాన్ని శాసించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్.. కనీస పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రెండో వన్డే రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఇక టీమిండియా కాంబినేషన్.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రవిడ్కు సవాల్గా మారింది. వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా ఆడుతున్న సిరీస్ కావడంతో ఆటగాళ్ల సత్తాకు పరీక్షగా ఈ సిరీస్ నిలుస్తోంది. ఈ క్రమంలోనే బెంచ్ ఆటగాళ్లకు చోటివ్వాలా? సీనియర్ ఆటగాళ్లనే కొనసాగించాలా? అనేది టీమిండియా మేనేజ్మెంట్ తేల్చుకోలేకపోతోంది.
వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్తో పాటు జయదేవ్ ఉనాద్కత్లను ఆడించాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకుంటే కీలక ఆటగాళ్లను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. జట్టులో మార్పులు చేయాలని భావిస్తే టీమిండియా మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీతో పాటు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలాకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది.
అప్పుడే సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్లకు లైన్ క్లియర్ కానుంది. తొలి వన్డేలో విఫలమైన సూర్యపై వేటు వేయాలనుకుంటే మాత్రం కోహ్లీ తుది జట్టులో కొనసాగుతాడు. ఎలాంటి మార్పులు లేకుండా తొలి వన్డే టీమ్నే కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు.
టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలో మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు అతను 22 ఇన్నింగ్స్లు ఆడగా.. ఇందులో 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ఇందులో మూడు సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. మరో 13 సార్లు 20 కంటే తక్కువే పరుగులు చేశాడు.

ఈ పేలవ రికార్డ్ నేపథ్యంలోనే సూర్యకు అవకాశం ఇవ్వడంపై ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరినీ ఆడించే ప్రయత్నం కూడా టీమిండియా మేనేజ్మెంట్ చేయవచ్చు. అప్పుడు ఉమ్రాన్ మాలిక్ బెంచ్కే పరిమితమవుతాడు.