న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం రాజ్కోట్ వేదికగా జరిగే రెండో వన్డేలో కివీస్తో ఆతిథ్య భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించిన సంగతి తెలిసిందే.
పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నా న్యూజిలాండ్ గట్టి పోటీనిచ్చింది. ఓ దశలో టీమిండియాకు ఓటమి భయాన్ని కూడా కలిగించింది. కానీ హర్షిత్ రాణా, కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ క్రమంలోనే రెండో వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తొలి వన్డేలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటం.. బౌలర్లు అంచనాలు అందుకోకపోవడంతో తుది జట్టులో మార్పులు అనివార్యమైంది. ఎవరిపై వేటు పడుతుంది? మరెవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తొలి వన్డేలో బౌలర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. ఒకవేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలంటే పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగవు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది.
రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, ఆయుష్ బదోనిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కావాలనుకుంటే బదోని, పేస్ ఆల్రౌండర్ను ఆడించాలనుకుంటే నితీష్ బరిలోకి దిగుతారు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. గిల్ హాఫ్ సెంచరీతో రాణించినా.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. అతని అవసరం జట్టుకు ఎంత ఉందో తొలి వన్డేతో మరోసారి అర్థమైంది. కోహ్లీ రాణించడం జట్టుకు కీలకంగా మారింది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన అయ్యర్ కూడా ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్లో రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపర్చాడు. అతను రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది.
కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా అదరగొట్టారు. సిరాజ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ కొత్త బంతితో అతను మరింత ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. తన మార్క్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంది. అర్ష్దీప్ సింగ్ రీఎంట్రీతో టీమ్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. టీమ్ కాంబినేషన్లో భాగంగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది.
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి/ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్/ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.