ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం కటక్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలోనూ ఇదే జోరును కొనసాగించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు అనవసర తప్పిదాలతో ఓటమిపాలైన ఇంగ్లండ్.. రెండో వన్డేలో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తోంది.
కోహ్లీ రీఎంట్రీ..
తొలి వన్డేలో సరైన కాంబినేషన్తో బరిలోకి దిగి విజయాన్నందుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్కు తుది జట్టులో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. మోకాలి నొప్పితో చివరి నిమిషంలో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కటక్ వన్డేతో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను అందుబాటులోకి వస్తే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు పడనుంది. కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి నంబర్ 4లో తన విలువ ఏంటో తెలియజేశాడు.

జైస్వాల్పై వేటు..
ప్రస్తుతం అతన్ని తప్పించలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి కోహ్లీని ఆడించాలంటే జైస్వాల్పై వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. విన్నింగ్ కాంబినేషన్ను మార్చవద్దని భావిస్తే రెండో వన్డేలోనూ కోహ్లీ బెంచ్కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా లైనప్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. వికెట్ కీపర్గా కేఎల్ రాహులే కొనసాగనున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ను అప్ది ఆర్డర్ ఆడించనున్నారు.
బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తీని ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను పక్కనపెడుతారు. మహమ్మద్ షమీకి రెస్ట్ ఇస్తే అర్ష్దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. కానీ బౌలింగ్ విభాగాన్ని మార్చే అవకాశాలు పెద్దగా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రయోగాలు చేయాలని భావిస్తే మాత్రం రిషభ్ పంత్ను కూడా ఆడించవచ్చు.
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ