హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా సిద్దమవుతుండగా.. మరోవైపు టీమ్ కాంబినేషన్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్తో భారత్ రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన టెస్ట్, వన్డే టీమ్లను ప్రకటించిన భారత సెలెక్షన్ కమిటీ.. టీ20 జట్టును ఇంకా ఎంపిక చేయలేదు.
వన్డేల్లో పెద్దగా మార్పులు చేయని ఎస్ ఎస్ దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. టెస్ట్ టీమ్లో మాత్రం సంచలనాలకు తావిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్లపై వేటు వేసి ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్లకు అవకాశం కల్పించింది.

ఈ మార్పులే ఇప్పుడు టీమ్మేనేజ్మెంట్ తలనొప్పిగా మారాయి. తుది జట్టులో ఎవర్నీ తీసుకోవాలనేదానిపై ద్రవిడ్ అండ్ కో ఏటూ తేల్చుకోలేకపోతుంది. రెండు టెస్ట్ల కాంబినేషన్ను అంచనా వేస్తే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో జట్టులోకి కొత్తగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్లో ఒకరు బరిలోకి దిగనున్నారు.
లెఫ్టాండర్ అయిన జైస్వాల్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జైస్వాల్ను ఓపెనర్గా ఆడించాలనుకుంటే గిల్ ఫస్ట్ డౌన్లో ఆడే అవకాశం ఉంది.
నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. ఐదో స్థానంలో మళ్లీ వైస్ కెప్టెన్సీ అందుకున్న రహానే బరిలోకి దిగనున్నాడు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న రహానే.. ఓవర్సీస్ కండిషన్స్లో కీలకం కానున్నాడు.
వికెట్ కీపర్ విషయంలోనూ టీమ్మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తెలుగు తేజం కేఎస్ భరత్కు మరో అవకాశం ఇవ్వాలా? లేక ఇషాన్ కిషన్ను తీసుకోవాలా? అనేది రోహిత్ సేనకు తలనొప్పిగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అవకాశం కల్పించినా కేఎస్ భరత్ సత్తా చాటలేకపోయాడు. కీపింగ్లో అదరగొట్టినా.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు.
కీపర్ కోణంలో ఆలోచిస్తే కేఎస్ భరత్కు తుది జట్టులో చోటు దక్కుతుంది. బ్యాటింగ్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తాడు. ఇషాన్ కిషన్నే ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆడనుండగా.. పేస్ ఆల్రౌండర్గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు.
మహమ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. మూడో పేసర్గా ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్లో ఒకరు బరిలోకి దిగనున్నారు. పిచ్ కండిషన్స్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. జయదేవ్ ఉనాద్కత్కే తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.
వెస్టిండీస్తో తొలి టెస్ట్కు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్/కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్