సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. మరో రసవత్తర సిరీస్కు సిద్దమవుతోంది. కివీస్తో వరుసగా మూడు టెస్ట్ల్లో ఓడి క్లీన్ స్వీప్ గురై ఘోర అవమానాన్ని మూటగట్టుకున్న రోహిత్ సేన.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం ఇరు జట్లకు కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్తో సిరీస్ ప్రారంభానికి ముందు 70+ విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలతో 58.33 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది.

ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే ఆసీస్ గడ్డపై టీమిండియా 4 మ్యాచ్లు గెలవాలి. ఆసీస్ గడ్డపై ఆ జట్టును నాలుగు మ్యాచ్ల్లో ఓడించడం చాలా కష్టం. కాకపోతే గత రెండు ఆసీస్ పర్యటనల్లో భారత్ విజేతగా నిలిచింది. మరోసారి అలానే సమష్టిగా రాణించి.. ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
రోహిత్ శర్మ ఔట్..
న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. తప్పిదాలపై సీరియస్గా ఫోకస్ పెట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత పనులతో తొలి మ్యాచ్ ఆడలేనని ఇప్పటికే రోహిత్ శర్మ.. బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అతని గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించనున్నాడు.
రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్.. యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. గత ఆసీస్ పర్యటనలో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 51 సగటుతో 259 పరుగులు చేశాడు. మరోసారి అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

కోహ్లీ బ్యాటింగ్ కీలకం..
ఆసీస్ గడ్డపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ప్రస్తుతం అతను పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నా.. ఆసీస్ గడ్డపై మెరుగైన రికార్డ్ ఉంది. మళ్లీ ఫామ్ అందుకునేందుకు అతనికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది. నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో దారుణంగా విఫలమై.. తుది జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్కు ఆసీస్ గడ్డపై అవకాశం దక్కనుంది.
అతని స్థానంలో బ్యాటింగ్కు దిగిన సర్ఫరాజ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతని స్థానంలో అనుభవం కలిగిన రాహుల్కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

పంత్ చెలరేగితే..
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన రిషభ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతను అప్ది ఆర్డర్లో కూడా ఆడొచ్చు. గత ఆసీస్ పర్యటనలో పంత్ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఐదు టెస్ట్ల్లో ఒక సెంచరీతో పాటు 99, మరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అశ్విన్ స్థానంలో సుందర్కు తుది జట్టులో చోటు దక్కనుంది. రవీంద్ర జడేజాతో కలిసి అతను స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా.. మహహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్లతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.