సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్కు టీమిండియా సిద్దమవుతోంది. జనవరి 22న కోల్కతా వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనుండగా.. అనూహ్యంగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ దక్కింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్తోనే అంతను అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా.. జట్టులో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో ఆడిన ఐదుగురు కుర్రాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది.

ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐ మూడు రోజుల ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనుంది. జనవరి 18న కోల్కతా వేదికగా ఈ క్యాంప్ ప్రారంభమవ్వనుంది. సిరీస్ ఎంపికైన ఆటగాళ్లతో పాటు కోచ్లు ఈ శిభిరంలో పాల్గొననున్నారు.
ఓపెనర్గా సంజూ శాంసన్..
టీ20ల్లో 3 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు ఓపెనర్గా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. మూడో స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మ ఆడనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ రెండు సెంచరీలు బాదాడు.
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఆడనున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వడంతో నితీష్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మహమ్మద్ షమీ రీఎంట్రీ..
అక్షర్ పటేల్ ఫస్ట్ ఛాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా అవకాశం అందుకోనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లోఉన్నాడు. పేసర్లుగా మహమ్మద్ షమీతో పాటు అర్ష్దీప్ సింగ్ ఆడనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా జట్టులోకి వస్తాడు. అప్పుడు రవి బిష్ణోయ్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఆ ఇద్దరికి నిరాశే..
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్కు నిరాశే ఎదురవ్వనుంది. ఆరంభ మ్యాచ్ల్లో ఈ ఇద్దరూ బెంచ్కే పరిమితం కానున్నారు. ఎక్స్ట్రా స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే సుందర్కు అవకాశం దక్కుతుంది.
ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ.
టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.