న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్దమవుతోంది. తరౌబా వేదికగా గురువారం రాత్రి 8 గంటలకు జరగనున్న తొలి టీ20లో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీసీఐ కుర్రాళ్లతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టును సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లందరిని టీ20 ఫార్మాట్కు దూరంగా ఉంచుతోంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో వెస్టిండీస్తో తొలి టీ20లో భారత తుది జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు ఎవరా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

యశస్వీ జైస్వాల్, ముకేశ్ కుమార్, తిలక్ వర్మ తొలిసారి టీ20 సిరీస్ కోసం టీమిండియా పిలుపు అందుకోగా.. ఆవేశ్ ఖాన్, సంజూ శాంసన్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తుది జట్టులో ఉండేది ఎవరు? ఉద్వాసనకు గురయ్యేది ఎవరా? అనేది ఆసక్తికరంగా మారింది. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కావడంతో దాదాపు అందరికి అవకాశం దక్కనుంది.
తొలి టీ20లో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు దక్కుతుందా? లేక వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను కొనసాగిస్తారా? అనేది చూడాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూసుకుంటే మాత్రం తిలక్ వర్మకు అవకాశం ఇస్తారు. ముందుగా యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఆడించి.. చివరి రెండు మ్యాచ్ల్లో తిలక్ వర్మకు చోటిచ్చే అవకాశం ఉంది.
ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ బరిలోకి దిగవచ్చు. యశస్వీ జైస్వాల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో సంజూ శాంసన్, నాలుగో స్థానంలో ఇషన్ కిషన్, ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా.. అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
భారత్ తుది జట్టు(అంచనా)
యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్/ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ఆవేశ్ ఖాన్