
ఓపెనర్లుగా రోహిత్, మయాంక్..
ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. రెగ్యులర్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అందుబాటులోకి వచ్చినా అతన్ని మూడో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఇండియా-ఎ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో అతడు మూడో స్థానంలో బరిలోకి దిగి డబుల్ సెంచరీ సాధించాడు. కాబట్టి, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతడిని మిడిలార్డర్లోనే బ్యాటింగ్కి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలు లేకపోవడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు శుభ్మన్ గిల్తో పాటు హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్లు పోటీ పడుతున్నారు.

విహారీ X శ్రేయస్ అయ్యర్
టీ20 సిరీస్లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ లెక్కన అతన్ని టెస్ట్ల్లో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా న్యూజిలాండ్తో అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ బాదాడు. కాబట్టి హనుమ విహారికి బదులు అయ్యర్కే అవకాశం దక్కవచ్చు. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అయిన విహారిని ఆడించాలనుకుంటే మాత్రం మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్లో ఒకరు బెంచ్కే పరిమితం కావచ్చు. విహారి జట్టులోకి వస్తే.. మయాంక్, గిల్లో ఒకరు రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు హనుమ విహారి సొంత గడ్డపై ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఇండియా-ఎ, ఇండియా జట్ల తరఫున అతడు విదేశాల్లో ఆడిన టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కి దిగాడు. సొంత గడ్డపై ఆరో స్థానంలో ఆడాడు. విహారి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు. కాబట్టి, అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్కి దింపే అవకాశం ఉంది.

ఐదో స్థానంలో పంత్..
లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ అయిన రిషభ్ పంత్ ఐదో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లంతా (మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ) రైట్ హ్యాండ్ బ్యాటర్లే. అందుకే, ఐదో స్థానంలో ఎడమ చేతి వాటం ఆటగాడు రిషభ్ పంత్, ఆరో స్థానంలో హనుమ విహారిని బరిలోకి దింపితే.. కుడి, ఎడమ కాంబినేషన్ కుదురుతుంది. ఆ తర్వాత రవీంద్ర జడేజాను ఏడో స్థానంలో ఆడతాడు. ఎనిమిదో స్థానంలో అశ్విన్ ఆడే అవకాశం ఉంది. అశ్విన్ ఫిట్గా లేకుంటే జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

మహమ్మద్ సిరాజ్ డౌట్..
సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ జట్టులోకి తిరిగి రావడంతో మహమ్మద్ సిరాజ్ చోటుపై సందేహాలు నెలకొన్నాయి. ఎక్స్ట్రా స్పిన్నర్ బరిలోకి దిగితే అతని చోటు గల్లంతయ్యే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లతో ఆడితే మాత్రం సిరాజ్ ప్లేస్కు డోకా లేదు. అలా కాదని ఎక్స్ట్రా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకుంటే మాత్రం సిరాజ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా పర్యటన అనంతరం ఈ సిరీస్తోనే మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

తొలి టెస్ట్ భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హనుమ విహారి/శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్గా ఉంటే)/జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్


Click it and Unblock the Notifications












