
హైదరాబాద్ స్టార్స్ ఔట్..
ఇక వెన్న నొప్పి నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ నెట్ సెషన్లో సీరియస్గా ప్రాక్టీస్ చేశాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కవర్ డ్రైవ్స్, ఆఫ్ డ్రైవ్స్ కొడుతూ కనిపించాడు. ఈ నేపథ్యంలోనే అతను మూడో టెస్ట్ బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ మీడియా సమావేశానికి కూడా హాజరుకానున్నాడు. దీన్ని బట్టే అతను చివరి మ్యాచ్ ఆడటం ఖాయమైంది. ఇక కోహ్లీ తుది జట్టులోకి వస్తే హైదరాబాద్ బ్యాట్స్మన్ హనుమ విహారిపై వేటుపడనుంది. ఇక రెండో టెస్ట్లో బౌలింగ్ చేస్తూ తొడ కండరాల గాయానికి గురైన మరో హైదరాబాద్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్.. మూడో టెస్ట్కు దూరం కానున్నాడు. గాయం తీవ్రత కారణంగా అతను ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదు. సిరాజ్ ప్లేస్లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉంది. నెట్ సెషన్లో ఇషాంత్ శర్మ చాలా సీరియస్గా బౌలింగ్ చేశాడు.

పుజారా, రహానే..
ఇక తప్పక ఆడాల్సిన మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో రాణించిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గత రెండేళ్లుగా నిలకడలేమి ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు.. సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యారు. దాంతో వీరి కెరీర్ ముగిసినట్లేనని, తదుపరి మ్యాచ్ ఆడటం కష్టమేననే అభిప్రాయం కలిగింది. కానీ కీలక సెకండ్ ఇన్నింగ్స్లో 100 ప్లస్ పార్టనర్షిప్తో అద్భుతంగా రాణించారు. విమర్శకులకు తమ బ్యాటింగ్తో సమాధానం చెప్పారు. ఈ ప్రదర్శనతో బ్యాట్స్మన్గా తమ లైఫ్టైమ్ను పెంచుకున్నారు. రాహుల్ ద్రవిడ్ సైతం ఈ ఇద్దరి ఆటగాళ్లను వెనుకొస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీనియర్లు ఉన్నందున శ్రేయస్ అయ్యర్, విహారి వంటి ఆటగాళ్లు కొంతకాలం వేచి చూడాల్సిందేనన్నాడు. దాంతో ఈ సీనియర్ ఆటగాళ్లు మూడో టెస్ట్ ఆడటం ఖాయమైంది.

రిషభ్ పంత్కు అగ్నిపరీక్ష..
చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వైఫల్యాల నేపథ్యంలో రిషభ్ పంత్ నిలకడలేమి ప్రదర్శన పెద్దగా కనిపించలేదు. కానీ సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో నిర్లక్ష్యపు షాట్తో వెనుదిరగడం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో అతనికి కేప్టౌన్ టెస్ట్ అగ్ని పరీక్షలా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతనిపై వేటు వేసే సాహసం టీమిండియా చేయకపోవచ్చు కానీ చివరి టెస్ట్లో మెప్పించకుంటే మాత్రం అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లే. రాహుల్ ద్రవిడ్ సైతం పంత్ను పరోక్షంగా హెచ్చరించాడు. షాట్ సెలెక్షన్లో ఆచితూచి వ్యవహరించాలని సూచించాడు.

ఇషాంత్కు చాన్స్..
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆడటం ఖాయం. ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చోటుకు కూడా డోకా లేదు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీతో పాటు శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ బరిలోకి దిగనున్నారు. కెరీర్ చరమాంకంలో ఉన్న ఇషాంత్.. ఈ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
సిరాజ్ గైర్హాజరీలో అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. గత పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాంత్ వరుస గాయాల నేపథ్యంలో జట్టును వీడాడు.

భారత తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ


Click it and Unblock the Notifications












