
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ..
గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపించి మూల్యం చెల్లించుకున్న టీమిండియా ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ రోజు భారత ఇంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటుందంటే దానికి ప్రధాన కారణం ఈ ఓపెనింగ్ జోడీ వైఫల్యమే. ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్మురేపిన ఈ ఇద్దరు ఆటగాళ్లు అసలు మ్యాచ్ల్లో చేతులెత్తేసారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వైఫల్యం.. రాహుల్పై ఒత్తిడిని పెంచుతోంది. పాకిస్థాన్తో మ్యాచ్లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అవ్వడంతో రాహుల్ తీవ్ర ఒత్తిడి గురై ఔటయ్యాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ ఆరంభంలోనే ఔటవ్వడంతో వేగంగా ఆడే తాపత్రయంలో క్యాచ్ ఔటయ్యాడు. అఫ్గాన్తో మ్యాచ్లోనైనా రోహిత్-రాహుల్ మెరవాలి. లేకుంటే భారత్కు కష్టాలు తప్పవు.

సూర్యకుమార్ యాదవ్ డౌట్..
ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ కోసం తన ప్లేస్ త్యాగం చేసి మూల్యం చెల్లించుకున్న విరాట్.. అఫ్గాన్ మ్యాచ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిందే. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే కోహ్లీ.. గత మ్యాచ్లో సింగిల్స్ రాకపోవడంతో ఫ్రస్టేట్ అయి కివీస్ ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇక నాలుగో ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ కోసం గత మ్యాచ్లో అతన్ని తప్పించి టీమ్మేనేజ్మెంట్ మూల్యం చెల్లించుకుంది. గాయం కారణంగానే అతన్ని పక్కనపెట్టామని చెప్పింది. అతను ఫిట్గా ఉంటే తుది జట్టులో ఉంటాడు. లేదంటే ఇషాన్ కిషన్కే చాన్స్ దక్కనుంది. ఆ తర్వాత రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనున్నాడు. పాకిస్థాన్పై పర్వాలేదనిపించిన పంత్.. తన సహజ శైలిలో ఆడలేకపోతున్నాడు.

ఆల్రౌండర్లు హార్దిక్, జడేజా..
ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కొనసాగనున్నారు. ఈ ఇద్దరూ గత రెండు మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేదు. హార్దిక్ గత మ్యాచ్లో బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. ఇక బ్యాటింగ్లో మునపటిలా ఆడలేకపోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది. ఇక జడేజా బ్యాటింగ్లో పర్వాలేదనపిస్తున్నా.. బౌలింగ్ మాత్రం మరీ నాసిరకంగా మారింది. అతని బౌలింగ్ను ప్రత్యర్థి బ్యాట్స్మన్ దంచికొడుతున్నారు. న్యూజిలాండ్తో భారత్ కనీసం 100 పరుగులైన చేయగలిగిందంటే అది జడేజా చలువే. అయితే అతను బౌలింగ్లో మెరుగవ్వాల్సి ఉంది.

పేస్ త్రయమే..
రాత్రి మ్యాచ్ కావడంతో ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్లే ఆడనున్నారు. బుమ్రా మినహా మిగతా ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. షమీ బౌలింగ్ అయితే మరీ నాసిరకంగా మారింది. దారుణంగా పరుగులిస్తున్నాడు. ఇక గత మ్యాచ్తో జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అతను ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. బౌలింగ్లో దారళంగా రన్స్ ఇచ్చి కివీస్ విజయాన్ని మరింత సులువు చేశాడు. బుమ్రా ఒక్కడు పోరాడుతున్నా అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించడం లేదు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్కు అవకాశం దక్కవచ్చు. గత రెండు మ్యాచ్ల్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ దారుణంగా విఫలమయ్యాడు. అతనిపై వేటు పడటం ఖాయం.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా


Click it and Unblock the Notifications












