India Palying XI vs SA for 3rd ODI: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. గురువారం పార్ల్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో గెలిచిన భారత్.. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసింది.
దాంతో ఆఖరి మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రెండు మ్యాచ్ల్లో బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. బౌలింగ్కు అనుకూలమైన వికెట్లు తయారు చేయడంతో.. బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.

సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో వన్డే గెలిస్తే.. చివరి మ్యాచ్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కేది. కానీ ఓటమి పాలవ్వడంతో ఆఖరి మ్యాచ్ గెలవడం కీలకమైంది. ఈ క్రమంలోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.
దాంతో చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న రజత్ పటీదార్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్లకు మళ్లీ నిరాశే ఎదురవ్వనుంది. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కాగా.. అతని స్థానంలో రింకూ సింగ్ అరంగేట్రం చేశాడు.
టీ20ల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్.. వన్డేల్లో ఆ జోరును కొనసాగించలేకపోయాడు. దూకుడుగా ఆడే క్రమంలో స్టంపౌట్గా వెనుదిరిగాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ రజత్ పటీదార్ను ఆడించాలనుకుంటే మాత్రం తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన తెలుగు తేజం తిలక్ వర్మపై వేటు వేయవచ్చు.
వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇవ్వాలనుకుంటే అక్షర్ పటేల్కు ఉద్వాసన పలుకుతారు. అంతే తప్పా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నారు.
సాయి సుదర్శన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదినా.. రుతురాజ్ దారుణంగా విఫలమయ్యాడు. చివరి మ్యాచ్లోనైనా అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డౌన్లో తెలుగు తేజం తిలక్ వర్మ, నాలుగో స్థానంలో వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయనున్నాడు. తిలక్ వర్మతో పాటు సంజూ కూడా తమ మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేకపోయారు.
ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనుండగా.. ఆరో స్థానంలో రింకూ సింగ్ బరిలోకి దిగుతాడు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. పేస్ బాధ్యతలను ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్లు పంచుకోనున్నారు. బ్యాటింగ్ విభాగం చెలరేగితేనే ఆఖరి మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది.
తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ/రజత్ పటీదార్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్.