India Palying XI vs SA for 2nd ODI: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మంగళవారం జిక్యూబెర్హా వేదికగా జరగనున్నరెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో సాధించిన విజయ ఉత్సాహంతో రెండో వన్డేలోను గెలిచి 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది.
తద్వారా చివరి మ్యాచ్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనుకుంటోంది. మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. చావోరేవోలాంటి ఈ మ్యాచ్లో ఎలాగైన గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది. తొలి వన్డే బరిలోకి దిగిన తుది జట్టులో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది.

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండడని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అతను టెస్ట్ టీమ్ ప్రిపరేషన్స్లో పాల్గొంటాడని చెప్పింది. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో రింకూ సింగ్.. వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు.
మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ మ్యాచ్లో రుతురాజ్ విఫలమైనా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఫస్ట్ డౌన్లో తెలుగు తేజం తిలక్ వర్మ, నాలుగో స్థానంలో వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనుండగా.. ఆరో స్థానంలో రింకూ సింగ్ బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. దాంతో యుజ్వేంద్ర చాహల్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
పేస్ బాధ్యతలను ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్లు పంచుకోనున్నారు. తొలి మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఆవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు తీసాడు. టీమ్ కాంబినేషన్లో మార్పులు చేయకపోతే.. యుజ్వేంద్ర చాహల్తో పాటు రజత్ పటీదార్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లకు నిరాశే ఎదురవ్వనుంది.
తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్.