ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్కు దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా ఈ ఫార్మాట్కు దూరంగా ఉంది. గతేడాది శ్రీలంకతో ఒకే ఒక్క సిరీస్ ఆడగా.. అందులో నిరాశే ఎదురైంది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా..
ఆ సిరీస్ పరాజయం తర్వాత ఇంగ్లండ్తోనే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. ఇప్పటికే ఈ సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ఒకే జట్టును ప్రకటించింది.
వెన్ను నొప్పితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా.. పూర్తిగా కోలుకుంటే ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. అయితే అతని ఫిట్నెస్పై ఎలాంటి సమాచారం లేదు.
యశస్వి జైస్వాల్ డౌట్..
ఇంగ్లండ్తో సిరీస్లో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్లోని కాంబినేషన్నే ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించనున్నారు. జట్టులోకి యశస్వి జైస్వాల్ను తీసుకోవడంతో ఓపెనర్గా ఎవరిని ఆడిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే.. యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. అప్పుడు గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్గా రిషభ్ పంత్కు బదులు కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. ఒకవేళ గిల్ను ఓపెనర్గా పరిగణలోకి తీసుకుంటే రిషభ్ పంత్ వికెట్ కీపర్గా ఆడుతాడు. అప్పుడు కేఎల్ రాహుల్ బెంచ్కే పరిమితమవుతాడు.
జడేజాకు నోఛాన్స్..
విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్లో ఆడనుండగా.. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్లు ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు. రవీంద్ర జడేజాను ఆడించాలనుకుంటే అక్షర్ పటేల్ బెంచ్కు పరిమితమవుతాడు.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ.