
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని నెలలుగా దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నాడు. నాగ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తిలక్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగవకపోవడంతో కొన్ని రోజుల క్రితం సొంతూరు మాలిక్ చౌక్కు తరలించారు. అక్కడ ఈ రోజు తిలక్ యాదవ్ మరణించినట్లు ఉమేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన తిలక్ ఉద్యోగ రీత్యా మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్థిరపడ్డారు. వాల్నీ కోల్ మైన్లో పని చేసి రిటైర్ అయ్యారు. రెజ్లింగ్ పట్ల ఆయనకు అమితాస్తి. ఇక కొడుకును పోలీస్గా చూడాలని తిలక్ యాదవ్ భావించారు. అందుకు తగ్గట్లుగా ఉమేశ్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో క్రికెటర్ అవుతానని తండ్రిని ఒప్పించిన ఉమేశ్ యాదవ్.. టీమిండియా పేసర్గా ఎదిగాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాలో ఉమేశ్ యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. నాగ్పూర్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్ట్ల్లో భారత్ విజయం సాధించగా.. ఈ రెండు మ్యాచ్ల్లో ఉమేశ్ యాదవ్ బెంచ్కే పరిమితమయ్యాడు. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగుతుండటం.. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ సత్తా చాటుతుండటంతో ఉమేశ్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కడం లేదు.
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్.. గత కొన్ని రోజులుగా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. జట్టులో యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో ఉమేశ్ యాదవ్కు అవకాశం దక్కడం లేదు. మార్చి 1 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్లో ఉమేశ్ యాదవ్ కోల్కతా నైట్రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 54 టెస్ట్లు ఆడి 164 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్.. 75 వన్డేల్లో 106 వికెట్లు, ఏడు టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.