సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్కు టీమిండియా సిద్దమైంది. కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నదమవుతుంది. అయితే కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్కు ర్యాంక్ టర్నర్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఈ మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా ర్యాంక్ టర్నర్ పిచ్లపై ఆడలేక మూల్యం చెల్లించుకుంది. ఈ పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరే అవకాశాలను దెబ్బతిన్నాయి.

గతంలో స్పిన్తోనే టీమిండియా విజయాలు సాధించేది. కానీ గత రెండేళ్లుగా భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం నేపథ్యంలో టీమిండియా రూటు మార్చింది. పేస్తో పాటు కాస్త స్పిన్, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వికెట్లపై ఆడాలనుకుంటుంది. ర్యాంక్ టర్నర్ పిచ్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఈ క్రమంలోనే తొలి టెస్ట్కు సమతూకమైన పిచ్ను సిద్దం చేశామని వెల్లడించాడు.
సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరిస్తోంది. ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. స్పిన్ పిచ్లు సిద్దం చేసినా తమకే అడ్వాంటేజ్గా మారుతుందని సౌతాఫ్రికా భావిస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ పర్యటనలో ఆ జట్టు 1-1తో రెండు టెస్ట్ల సిరీస్ను సమం చేసుకుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా స్పిన్నర్లు హర్మర్(13), ముత్తు సామి(11), కేశవ్ మహరాజ్(9)లు 33 వికెట్లు పడగొట్టారు. ఆ జట్టు స్పిన్ విభాగం బలంగా ఉంది. ఈ క్రమంలోనే సమతూకమైన పిచ్లను సిద్దం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.