హైదరాబాద్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం విరామంలో ఉన్న టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నెల రోజుల విశ్రాంతిని భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు.
కొందరు వెకేషన్స్ పేరిట విదేశాలకు చెక్కేస్తే మరికొందరు దేశంలోనే తమ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. మరోవైపు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్ల ఎంపికపై సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఈ నెల 27న ఈ పర్యటనకు సంబంధించిన వేర్వేరు జట్లను ప్రకటించే అవకాశం ఉంది.

సుమారు రెండు నెలల పాటు సాగే ఈ పర్యటనకు సీనియర్లకు రెస్ట్ ఇవ్వనున్నారని ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం లేదని తాజాగా బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ పర్యటనలోని టెస్ట్, వన్డే సిరీస్లు ఆడనున్నారని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ రెండు ఫార్మాట్లలో భారత జట్టును అతనే నడిపించనున్నాడని, టీ20ల్లో మాత్రం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు బరిలోకి దిగుతుందన్నాడు.
సీనియర్లు బరిలోకి దిగుతుండటంతో యువ ఆటగాళ్లంతా టీ20 సిరీస్కు మాత్రమే పరిమితం కానున్నారు. ఈ ఏడాదే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగుతుండటంతో టీమ్మేనేజ్మెంట్ కాంబినేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జట్టు సత్తాను పరీక్షించేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకోనుంది.
ఈ పర్యటనకు ఎంపిక చేసే వన్డే జట్టులో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మకు అవకాశం దక్కనుండగా.. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయనున్నారు. వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లను తీసుకోనున్నారు. సంజూ శాంసన్కు జితేశ్ శర్మతో పోటీ నెలకొంది. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ను ఎంపిక చేయనున్నారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్డీప్ యాదవ్ జట్టులోకి రానుండగా.. పేసర్లుగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ ఎంపిక చేయనున్నారు. మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వాలని భావిస్తే అర్ష్దీప్ సింగ్ జట్టులోకి రానున్నాడు.
వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే(అంచనా),
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్/జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్.