భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. శనివారం మూడో రోజు ఆటను చూసేందుకు హిట్ మ్యాన్ ఓవల్ మైదానానికి వచ్చాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన గంట తర్వాత రోహిత్ శర్మ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కెమెరాలను గమనించిన రోహిత్.. చేతులతో వద్దంటూ సైగ చేశాడు. సాధారణ అభిమాని తరహాలోనే రోహిత్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ప్రకటన వెలువడిన వారం రోజులకే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్కు గురి చేశాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిసారిగా ఆడిన రోహిత్ శర్మ.. పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆఖరి టెస్ట్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు. గత రెండేళ్లుగా టెస్ట్ల్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరిందని, దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ రోహిత్, విరాట్ కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్ మిస్టరీగానే ఉంది.
ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో భారత్ నిలకడగా ఆడుతోంది. 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 40 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(82 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతుండగా.. ఆకాష్ దీప్(53 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది.