ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో విజయం సాధించిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి విజయం. దాంతో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టును మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ముఖ్యంగా భారత్పై అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు కూడా భారత్ విజయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్ బజ్బాల్కు భారత్ అస్సలు భయపడదని మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. శుభ్మన్ గిల్ను కోహ్లీ కెప్టెన్సీతో పోల్చడం సరికాదని నాజర్ హుస్సేన్ తెలిపాడు.
'రెండో టెస్ట్ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్ ఆట చూస్తుంటే ఇంగ్లండ్ బజ్బాల్కు ఏ మాత్రం భయపడమన్నట్లుగా ఉంది. జట్టులో ప్రతీ ఒక్కరిపై టీమ్మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. శుభ్మన్ గిల్ సారథిగా సత్తా చాటాడు. బ్యాటర్గానూ జట్టును ముందుండి నడిపించాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇది తొలి విజయం. చరిత్రలో నిలిచిపోయే క్షణాలు. ఈ ఉత్సాహంతో లార్డ్స్లో మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇంగ్లండ్పై 20 వికెట్లు తీయడం అతిపెద్ద అచీవ్వెంట్. టీమిండియా బౌలింగ్ కాంబినేషన్ బాగుంది. లార్డ్స్లో జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడు. అప్పుడు టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతోంది. ఇంగ్లండ్ బౌలర్ బషీర్ ఎక్కువగా పరుగులివ్వడం ఇంగ్లండ్కు నష్టం చేసింది.'అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంతో మెరుగయ్యాడు. తొలి టెస్ట్లో అతను ఇతరుల సలహాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాడు. డగౌట్ సూచనలను ఫాలో అయ్యాడు. కానీ రెండో టెస్ట్లో మాత్రం చాలా పరిణతి కనబర్చాడు. పంత్, కేఎల్ రాహుల్ సాయం తీసుకున్నా.. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ నిఖార్సైన కెప్టెన్గా కనిపించాడు. అయితే శుభ్మన్ గిల్ను కోహ్లీతో పోల్చడం సరికాదు. గిల్ మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు.'అని నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.