మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్కు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాంతో టాస్కు రెండు గంటలు ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. వర్షం పడటం వల్ల పిచ్ తడిగా మారి బౌలింగ్కు అనుకూలిస్తుందని భావిస్తున్నాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం. భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఈ మ్యాచ్పై చాలా నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం.'అని లారా వోల్వార్డ్ట్ చెప్పుకొచ్చింది.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. 'వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మేం బాగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నమోదు చేసే ప్రయత్నం చేస్తాం. ఐదు-ఆరు ఓవర్ల తర్వాత పిచ్ సాధారణంగా మారుతుందని అనుకుంటున్నా. మేం విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం.
ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్ తర్వాత మాకు రెండు రోజుల విశ్రాంతి లభించింది. జట్టంతా ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉంది.'అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ మ్యాచ్లో ఎవరూ గెలిచినా మహిళల క్రికెట్లో కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడమే మంచిదైందని, ఛేజింగ్లో ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
భారత్ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మారిజానే కాప్, సినలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నడినే డి క్లర్క్, అయబొంగా ఖాకా, నోంకులేకో మ్లాబా