సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమైంది. శనివారం సాగర తీరం విశాఖపట్నం వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాంచీలో గెలిచి రాయ్పూర్లో ఓడిన భారత్.. వైజాగ్లో మళ్లీ విజయఢంకా మోగించాలని భావిస్తోంది. రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్.. తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు తొలి వన్డేలో తృటిలో చేజారిన విజయాన్ని రెండో వన్డేలో సౌతాఫ్రికా అందిపుచ్చుకుంది. ప్రణాళికపరంగా ఆడి సిరీస్ రేసులో నిలిచింది. ఆఖరి వన్డేలోనూ సమష్టి ప్రదర్శనతో విజయం సాధించి టీమిండియాకు మరో పీడకలను మిగల్చాలనే పట్టుదలతో సఫారీ టీమ్ ఉంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.

ఆఖరి వన్డేలోనూ టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో రిషభ్ పంత్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శుభ్మన్ గిల్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను యశస్వి జైస్వాల్ అందిపుచ్చుకోలేకపోయాడు.
వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అయితే మూడో వన్డేలో అతనికి ఆఖరి అవకాశం దక్కనుంది. ఒకవేళ జైస్వాల్ను తప్పించాలనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ను ఓపెనర్గా ఆడించాల్సి ఉంటుంది. ఆ సాహసం గంభీర్ చేయకపోవచ్చు. ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా.. రోహిత్ శర్మ, జైస్వాల్ చెలరేగాల్సి ఉంది. రుతురాజ్ కూడా తన జోరును కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. తెలుగు తేజం, లోకల్ భాయ్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేక బెంచ్కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి. ఒకవేళ నితీష్ ఆడించాలనుకుంటే వాషింగ్టన్ సుందర్పై వేటు పడుతుంది.
తొలి రెండు వన్డేల్లో సుందర్ అంచనాలను అందుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉండగా.. రవీంద్ర జడేజా ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ సత్తా చాటాలి. రెండో వన్డేలో విఫలమైన భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా , ప్రసిధ్ కృష్ణ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలి. అప్పుడే భారత్కు విజయం సాధ్యమవుతుంది. బెంచ్ ప్లేయర్లు ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, తిలక్ వర్మలకు నిరాశే ఎదురవ్వనుంది.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్/నితీష్ కుమార్ రెడ్డి/, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ
భారత వన్డే టీమ్:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/కీపర్), రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.