టీమిండియా హోమ్ సీజన్కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాతో ఆతిథ్య భారత్ రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సన్నదమవుతున్నాయి. ఈ సిరీస్లో గెలిచిన జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగవనున్నాయి. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వన్డే, టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాన్నందుకున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టెస్ట్ల్లో మాత్రం ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది.
ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరలేకపోయింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ గంభీర్ కోచింగ్కు సవాల్గా మారింది. తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ గెలిచి జోరు మీద ఉంది.

తొలి టెస్ట్కు ర్యాంక్ టర్నర్ పిచ్ వద్దని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. సమతూకమైన పిచ్ సిద్దం చేశామని కోల్కతా పిచ్ క్యూరెటర్ మీడియాకు తెలిపాడు. న్యూజిలాండ్తో ఎదురైన పరాజయం నేపథ్యంలోనే టీమిండియా తమ ప్లాన్ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా స్పిన్ బౌలింగ్ ఆడటంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే భారత రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
తొలి టెస్ట్ బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో సూపర్ ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్కు అవకాశం దక్కుతుందా? అనేది చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికార టెస్ట్లో ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదాడు. సూపర్ ఫామ్లో ఉన్న ధ్రువ్ జురెల్ను తుది జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇద్దరు వికెట్ కీపర్లతో బరిలోకి దిగితే తుది జట్టులో నుంచి ఎవర్ని తప్పించాలనేది చర్చనీయాంశంగా మారింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ డౌన్లో సాయి సుదర్శన్ ఆడనుండగా.. కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రిషభ్ పంత్ ఐదో స్థానంలో ఆడనున్నాడు. ఏకైక పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనున్నాడు. ధ్రువ్ జురెల్ను ఆడించాలంటే మూడో స్థానంలో పెద్దగా ప్రభావం చూపని సాయి సుదర్శన్ను తప్పించాలి. లేదంటే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఒక స్పిన్ ఆల్రౌండర్ను పక్కన పెట్టాలి. ఇద్దరిలో ఎవర్నీ పక్కనపెట్టినా టీమిండియాకు ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గుతుంది. అసలే బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండాలనే సూత్రాన్ని గంభీర్ పాటిస్తున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ డెప్త్కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి ఆల్రౌండర్లను తప్పించకపోవచ్చు.
ధ్రువ్ జురెల్ను ఆడించాలని భావిస్తే సాయి సుదర్శన్పైనే వేటు పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ధ్రువ్ జురెల్ బెంచ్కు పరిమితమవుతాడు. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ప్లేస్కు డోకా లేదు. దాంతో అక్షర్ పటేల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నారు. మూడో పేసర్ కావాలనుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆకాశ్ దీప్ ఆడుతాడు. బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పడిక్కల్కు నిరాశే ఎదురవ్వనుంది.
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/ధ్రువ్ జురెల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (WK), నితీష్ కుమార్ రెడ్డి/ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.