ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. పరిమిత ఓవర్లకు సిద్దమవుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్తో పాటు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ వరకు హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
ఈ టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. అతని రిటైర్మెంట్పై వార్తలు రాగా.. వాటిని రోహిత్ ఖండించాడు. దాంతో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతాడనే విషయంపై స్పష్టమైంది. ఆస్ట్రేలియా పర్యటనలోని ఘోర వైఫల్యం నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్కు బలమైన జట్టును ఎంపిక చేయడంపై సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఐసీసీ డెడ్లైన్ ప్రకారం జనవరి 12లోపు టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడి జట్టును ప్రకటించాలి. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ రాగా.. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యాడు. శుభ్మన్ గిల్ను పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్గా నియమించారు. భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా అప్పట్లో చెప్పారు. మరికొన్ని ఐసీసీ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతాడని కూడా స్పష్టం చేశారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లతో ఒంటరి పోరాటం చేసిన బుమ్రాకు ప్రమోషన్ ఇస్తూ వన్డే ఫార్మాట్ వైస్ కెప్టెన్గా నియమించాలని నిర్ణయించినట్లు తెలిస్తోంది. దాంతో శుభ్మన్ గిల్పై వేటు పడనుంది. గతంలో రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరించిన హార్డిక్ పాండ్యాకు కూడా అవకాశం లేకుండా పోయింది.
'ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.'అని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. గతంలో కొన్ని వన్డే సిరీస్ల్లో బుమ్రా డిప్యూటీగా వ్యవహరించాడు. 2022లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో బుమ్రా కేఎల్ రాహుల్తో డిప్యూటీగా వ్యవహరించాడు. 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టును నడిపించాడు.