కాన్పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో భాగంగా ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ బంతి పడకుండానే రద్దయ్యింది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారింది. వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం.. ఆటను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో తమ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా లెజెండ్స్ను ఓడించింది. ఇక ఇండియా లెజెండ్స్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ (82పరుగులు 42బంతుల్లో 5ఫోర్లు 6సిక్సర్లు నాటౌట్) చెలరేగి ఆడాడు. దీంతో ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 217పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 156పరుగులకే పరిమితమైంది.
మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ లెజెండ్స్ను 7వికెట్ల తేడాతో శ్రీలంక లెజెండ్స్ ఓడించింది. తద్వారా 8జట్ల పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంక తొలుత బౌలింగ్లో ఇంగ్లండ్ను 78 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ నేతృత్వంలోని శ్రీలంక లెజెండ్స్కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. సెప్టెంబరు 11న తమ కెప్టెన్ చేసిన అద్భుతమైన సెంచరీతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఓపెనర్లో ఆస్ట్రేలియా లెజెండ్స్ను శ్రీలంక ఓడించిన సంగతి తెలిసిందే.
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట దిగ్గజ ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తోంది. గతేడాది ఈ టోర్నీకి సంబంధించిన తొలి ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సిరీస్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ చేరడంతో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.