
రాయ్పూర్: టీమిండియా మాజీ ఆల్రౌండర్, ఇండియా లెజెండ్స్ స్టార్ యువరాజ్సింగ్కు బాహుబలిలాంటి ఘన స్వాగతం లభించింది. ఆదివారం శ్రీలంక లెజెండ్స్తో జరిగిన రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్స్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 60), యూసఫ్ పఠాన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది యువరాజ్ సింగ్కు వినూత్న రీతిలో స్వాగతం పలికింది. మ్యాచ్ ముగించుకొని హోటల్కు వచ్చిన అతనికి బాహుబలి రేంజ్లో వెల్కమ్ చెప్పారు. హోటల్లోకి ప్రవేశిస్తుండగా సిబ్బంది రెండు వైపులా నిల్చొని వంట సామగ్రి అయిన గరిటెలను పైకెత్తి స్వాగతం పలుకుతున్నట్లు పోజిచ్చారు. దానికి హిందీ బాహుబలి పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా సెట్చేశారు. దాంతో యువీ సైతం సంతోషంతో స్టెప్పులేసుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈ వీడియోను అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 'బ్రోకెన్ బాహుబలి' అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక ఫైనల్ మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెహ్వాగ్(10), బద్రీనాథ్(7) విఫలమైనా కెప్టెన్ సచిన్ టెండూల్కర్(23 బంతుల్లో 5 ఫోర్లతో 30), యువరాజ్, యూసఫ్ పఠాన్లు రాణించారు. లంక బౌలర్లలో మహరూఫ్, సనత్ జయసూర్య, వీరరత్నె తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. జయసూర్య (43), జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించినా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లలో యూసఫ్ పఠాన్(2/26), ఇర్ఫాన్ పఠాన్(2/26) తలా రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా సచిన్..ఈ టోర్నీ కప్ను అందుకున్నాడు.